ప్రపంచ పర్యావరణ దినోత్సవం – మొక్కలు నాటిన ఎంపీ సంతోష్ కుమార్…

ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ఈ సందర్భంగా ములుగు (గజ్వేల్) అటవీ కళాశాల, పరిశోధన సంస్థ ప్రాంగణంలో ఎమ్మెల్యేలు అరికెపూడి గాంధీ, మాధవరం కృష్ణారావు, కేపీ వివేకానంద గౌడ్, ఎమ్మెల్సీలు కుర్మయ్యగారి నవీన్ రావు, శంబీపూర్ రాజు తదితరులతో కలిసి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంపీ జోగినిపల్లి సంతోష్ కుమార్ మాట్లాడుతూ… రోజు రోజుకు మారుతున్న పర్యావరణ మార్పులను దృష్టిలో ఉంచుకొని అందరం కూడా పెద్ద ఎత్తున మొక్కలను నాటాలని పిలుపునిచ్చారు. అందుకోసం తాను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టానని… దాంతో ప్రజల్లో చైతన్యం తీసుకు వచ్చానని అన్నారు.
అదేవిధంగా పర్యావరణం పరిరక్షణ కోసం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంస్థ కృషి చేస్తుంది అని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే కేపీ వివేకానంద గౌడ్ మాట్లాడుతూ… పర్యావరణ పరిరక్షణ కోసం మనం అందరం పాటుపడాలని రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే కార్యక్రమాన్ని చేపట్టి యావత్ భారతదేశం పచ్చగా ఉండాలని కృషి చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో చెట్ల పెంపకం కోసం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి ప్రాధాన్యతను ఇస్తున్నారని ఆయన వివరించారు.