దళితుల ఓట్ల కోసమే కేసీఆర్ డ్రామాలు

తెలంగాణ మాజీ మంత్రి, బీజేపీ నేత ఏ.చంద్రశేఖర్ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి పదవి ఇచ్చినప్పుడే కేసీఆర్ ను దళితులు విశ్వసిస్తారని తెలిపిన ఆయన… రాష్ట్రంలోని ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ఏడేళ్ళ తర్వాత సీఎం కేసీఆర్ కు దళితులు గుర్తురావటం సంతోషకరమని అన్నారు.
అదేవిధంగా దళితులు అండగా ఉండబట్టే తెలంగాణ ఉద్యమాన్ని కేసీఆర్ ముందుకు తీసుకెళ్ళగలిగారని వివరించారు. అలాగే తెలంగాణ ఉద్యమంలో దళితులు తిండికి లేక ఇబ్బంది పడితే.. కేసీఆర్ ఒక్క రోజు కూడా ఉపవాసం లేడని.. దళితులకు ముఖ్యమంత్రి ఇచ్చిన మూడెకరాల భూమి హామీని నెలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం హుజూరాబాద్ లో ఉన్న 45 వేల దళితుల ఓట్లు కోసమే కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని… దళితుల పుణ్యంతోనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని ఆయన స్పష్టం చేశారు. కాగా దళితులే కేసీఆర్ ను బొంద పెట్టే రోజులు దగ్గర పడ్డాయని… రాష్ట్రంలో దళితులపై వివక్ష ఉందని చెప్పడానికి నేరెళ్ళ ఘటనే ఒక ఉదాహరణ అని ఏ చంద్రశేఖర్ వివరించారు.