ఘంటసాల కుమారుడు రత్నకుమార్ ఇకలేరు…

ప్రముఖ గాయకుడు, స్వర్గీయ ఘంటసాల రెండో కుమారుడు రత్న కుమార్ ఈరోజు మృతి చెందారు. అయితే గత కొంతకాలంగా ఆయన చెన్నైలోని కావేరీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. రెండు రోజుల క్రితమే ఆయనకు కొవిడ్ నెగెటివ్ రిపోర్ట్ వచ్చింది. కానీ… చాలా కాలంగా ఘంటసాల రత్నకుమార్ కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉన్నారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఘంటసాల అమర గాయకుడిగా పేరు గడిస్తే, ఆయన కుమారుడైన రత్నకుమార్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కెరీర్ తొలినాళ్ళలో తన తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ గాయకుడు కావాలని తపించిన రత్నకుమార్.. ఎంతకీ బ్రేక్ రాకపోవడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కొనసాగారు. అయితే మొదట్లో తమిళ సినిమా కంటి కామాక్షికి తెలుగులో డబ్బింగ్ చెప్పారు రత్నకుమార్. అలాగే ఆ సినిమా సుమారు వందరోజులు ఆడటంతో వరుసగా అవకాశాలు వచ్చాయని రత్నకుమార్ తెలిపేవారు.
అదేవిధంగా సుమారు నాలుగు దశాబ్దాల కెరీర్ లో వేయికి పైగా తమిళ, తెలుగు, మలయాళ, హిందీ, సంస్కృత సనిమాలకు రత్నకుమార్ డబ్బింగ్ చెప్పారు. పది వేలకు పైగా తమిళ, తెలుగు టీవీ సీరియల్ ఎపిసోడ్స్ కు గాత్రాన్ని అందించారు. యాభైకు పైగా డాక్యుమెంటరీలకు వాయిస్ ఓవర్ అందించారు. కాగా గతంలో ఎనిమిది గంటల పాటు నిరవధికంగా డబ్బింగ్ చెప్పి ఆయన ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా చోటు దక్కించుకున్నారు. ఇంకా అమేజింగ్ వరల్డ్ రికార్డ్స్, తమిళనాడు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఆయన పేరు నమోదైంది. ఇంకా గాయకుడిగా సినిమా రంగంలో గుర్తింపు రాకపోయినా… పలు సాంస్కృతిక కార్యక్రమాలలో ఆయన లలిత సంగీతాన్ని ఆలపించేవారు. అలా వ్యాఖ్యాతగా కూడా వ్యవహరించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా బెస్ట్ మేల్ డబ్బింగ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డును అందుకున్నారు ఘంటసాల రత్నకుమార్. అంతేకాకుండా సుమారు యాభై అనువాద సినిమాలకు రచన కూడా చేశారు. కాగా ప్రస్తుతం రత్నకుమార్ కుమార్తె పూజా గాయనిగా రాణిస్తుండటం విశేషం..