కేసీఆర్ ది ధృతరాష్ట్ర పాలన : విరుచుకు పడ్డ బీజేపీ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ది ధృతరాష్ట్ర కౌగిలి అంటూ మండిపడ్డారు బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. తాజాగా టీఆర్ఎస్ నుంచి వలసలపై స్పందించిన ఆయన.. టీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు ఆలే నరేంద్రను వెళ్లకొట్టారని.. విజయ శాంతి, స్వామి గౌడ్ వంటి ఎంతో మందిని బయటకు పంపించారని విరుచుకు పడ్డారు. ఇక ఇప్పుడు ఈటల వంతు వచ్చిందని అన్నారు. అదేవిధంగా మధుసూదనాచారిని కేసీఆరే ఓడగొట్టారంటూ ఆయన విమర్శించారు.
అంతేకాకుండా ఆయన మాట్లాడుతూ… ఇక మిగిలింది హరీష్ రావే!.. హరిష్ రావుకు కూడా అనేక అవమానాలు జరిగాయని తెలిపారు. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు ఎందుకు పార్టీని వీడుతున్నారు? అంటూ ప్రశ్నించిన ప్రభాకర్.. తెలంగాణ ఉద్యమంలో లేనివాళ్లే కేసీఆర్ ప్రభుత్వంలో పదవులు అనుభవిస్తున్నారని మండిపడ్డారు. అలాగే నీ జీతగాల్లు తప్ప పార్టీలో ఉన్న ఉద్యమకారులు ఎవరు నీకు మద్దతుగా మాట్లాడం లేదని… తెలంగాణ రాజకీయ సమీకరణాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయని వెల్లడించారు. కాగా గత రెండు రోజులుగా అధికార పార్టీ నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని.. వ్యాక్సిన్ విషయంలో గ్లోబల్ టెండర్లు తుస్ మన్నాయని ఆయన అన్నారు.
అదేవిధంగా రాష్ట్రంలో ఉచిత వ్యాక్సినేషన్ జరుగుతుందంటే అది కేంద్రం వల్లనే అన్నారు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్. కేంద్రం రెండు నెల క్రితం ఉచిత రేషన్ ఇచ్చినా.. జూన్ వరకు పంపిణీ చేయలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పాలన చేయడం లేదని… రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన కుటుంబం తప్ప ఎవరూ కనపడటం లేదని ప్రభాకర్ విరుచుకుపడ్డారు.