ఏపీలో ఇసుక రీచ్ ల పేరిట ఓ కేటుగాడి భారీ మోసం……

ఆంధ్రప్రదేశ్ లో ఇసుక రీచుల పేరిట భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఏపీ వ్యాప్తంగా ఇసుక రీచుల్లో తవ్వకాలు సబ్ లీజులు ఇస్తామని ఏకంగా రూ.3.50 కోట్లు వసూలు చేసాడు ఓ మోసగాడు. గనుల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఐఏఎస్ అధికారి అయిన గోపాలకృష్ణ ద్వివేది సంతకాలు ఫోర్జరీ చేసి డాక్యుమెంట్స్ సృష్టించి.. ఓ కేటుగాడు భారీ మోసానికి తెగబడ్డాడు.
అయితే అసలేం జరిగింది అంటే ఏపీలో ఇసుక రీచ్ ల వేలం జేపీ గ్రూప్ కి ఇచ్చింది జగన్ ప్రభుత్వం. మరి ఇసుక రీచుల్లోని తవ్వకాలను సబ్ లీజ్ కి ఇస్తామని చెప్పి భారీ మోసానికి తెగబడ్డాడు కాకినాడకు చెందిన రామకృష్ణ సతీష్ కుమార్ అనే వ్యక్తి. 2018లో సైఫాబాద్ లోని ఫైనాన్స్ సెక్రటరీ సంతకం ఫోర్జరీ చేసిన కేసులో రామకృష్ణ సతీష్ కుమార్ కీలక నిందితుడుగా పోలీసులు గుర్తించారు. అలాగే ఏపీ వ్యాప్తంగా ఏడుగురు బాధితుల నుంచి 3.50 కోట్లు వసూలు చేసిన రామకృష్ణ సతీష్ కుమార్ భారీస్థాయిలో ప్రజలను మోసం చేసేందుకు అధికారుల పోర్జరీ సంతకాలతో అక్రమాలకు పాల్పడ్డాడు. కాగా ఈ కేసులో బెజవాడ భవానీ పురంలో ఇతనిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు అయింది. ఇదే ఘటనలో పోలీసులకు ఫిర్యాదు చేశారు జేపీ గ్రూప్ మేనేజర్ హర్ష కుమార్. దీంతో 471, 420, 465, 469, 471, 120 బి సెక్షన్ల కింద రామకృష్ణ సతీష్ కుమార్ పై కేసు నమోదు చేశారు. అయితే నిందితుని బ్యాంక్ అకౌంట్ లో ఉన్న రెండు కోట్ల రూపాయలను పోలీసులు సీజ్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.