ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాలి : మెగాస్టార్

తెలుగు జాతి ఆత్మ గౌరవాన్ని దశదిశలా చాటిన వ్యక్తి దివంగత నందమూరి తారక రామారావు. తిరుగులేని నాయకుడుగా, అటు సినిమాల్లోనూ, ఇటు ప్రజారంజక పాలనలోనూ విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా గుర్తింపు పొందారు నటరత్న నందమూరి తారకరామారావు. ఈరోజు ఆయన జయంతి. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కు సోషల్ మీడియా వేదికగా ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు.
ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కోరారు. ‘ప్రముఖ గాయకులు, నవయుగ వైతాళికులు భూపేన్ హజారికా గారికి మరణానంతరం భారత రత్న ఇచ్చినట్టు, మన తెలుగుతేజం, దేశం గర్వించే నాయకుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇస్తే అది తెలుగు వారందరికీ గర్వకారణం. వారి నూరవ జన్మదినం దగ్గర పడుతున్న సందర్భంగా ఎన్టీఆర్ గారికి ఈ గౌరవం దక్కితే అది తెలుగు వారందరికీ గర్వకారణం. ఆ మహానుభావుడి 99వ జన్మదినం సందర్భంగా వారిని స్మరించుకుంటూ’ అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. కాగా ఎన్టీఆర్ తనయుడు, నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. కరోనా కారణంగా అభిమానుల క్షేమం దృష్టిలో పెట్టుకొని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించడానికి వెళ్లట్లేదని నందమూరి రామకృష్ణ ప్రకటించారు. అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ సోషల్ మీడియా ద్వారా నివాళులు అర్పించారు. ఇంకా కాసేపటి క్రితమే నారా చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు ఎన్టీఆర్ ఘాటు వద్ద ఎన్టీఆర్ కు నివాళులు అర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *